ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మేయాలన్నా సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఉంటాయో? బ్యాంక్ గృహ రుణం ఎంతవరకు ఇస్తుందో? .. ఇలా ప్రతీ దశలోనూ సందేహాలే. వీటన్నింటికీ చిటికెలో పరిష్కారం చూపిస్తే? అయితే మీరు మైఓఎస్ ప్రాపర్టీ.కామ్ (మేక్ యువర్ ఓన్ స్పేస్ ప్రాపర్టీ.కామ్) యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే!
హైదరాబాద్కు చెందిన ఓల్యూబిల్లీస్ ప్రాపర్టీ స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేసింది. మైఓఎస్ ప్రాపర్టీ యాప్కు మెంటార్గా ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ డి. విజయ్ కిశోర్ రియల్టీకబర్.కామ్తో మాట్లాడారు. ఇప్పటివరకు యాప్ డెవలప్మెంట్ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 8 వేల యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి.
12 నగరాల్లో జియో ట్యాగ్..
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కాన్పూర్, చెన్నై, బెంగళూరు, పుణే, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోపాలిటన్స్, కార్పొరేషన్, స్పెషల్ అథారిటీ బిల్డింగ్ రూల్స్, మాస్టర్ప్లాన్స్లను డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్ (డీసీఆర్) సాంకేతిక పరిజ్ఞానంతో డీ–కోడింగ్ చేసి.. ప్రాపర్టీలకు జియో ట్యాగింగ్ చేశాం. దీంతో ఆయా ప్రాపర్టీ రెసిడెన్షియల్ జోన్లో ఉందా? కమర్షియల్ జోన్లో ఉందా? ధర ఎంత? వంటి అన్ని వివరాలు వస్తాయి.
ఎలా పనిచేస్తుందంటే?
స్మార్ట్ఫోన్లో మైఓఎస్ ప్రాపర్టీ.కామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ లొకేషన్స్లో మన ప్రాపర్టీ లొకేషన్, హద్దులను, రోడ్లును మ్యాపింగ్ చేయాలి. అంతే క్షణాల్లో ప్రాపర్టీ త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు ఆయా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఉంది? ప్రాపర్టీ విలువ ఎంత? వంటి అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటితో పాటూ ఆర్కిటెక్ట్, ప్లానర్స్, సివిల్, స్ట్రక్చరల్ ఇంజనీర్ల వివరాలు, న్యాయపరమైన సలహాల కోసం లీగల్ నిపుణులు, రుణాల కోసం ఆర్ధిక సంస్థలు, బ్యాంక్ల వివరాలు, అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల వివరాలన్నీ వచ్చేస్తాయి.
ప్రవాసుల కోసం ల్యాండ్గార్డ్..
ప్రత్యేకంగా ప్రవాసులు (ఎన్నారైల) కోసం ల్యాండ్గార్డ్ అనే మరొక ఫీచర్ ఉంది. ఇదేంటంటే? ప్రవాసులు మెట్రో నగరాల్లో స్థలాలు, ప్రాపర్టీలను కొంటుంటారు. ఆయా ప్రాపర్టీల్లో ఏం జరుగుతుంది? చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఎవరైనా కబ్జా చేశారా? వంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఇందుకోసం ల్యాండ్గార్డ్ ఫీచర్లో ప్రతి నెలా ప్రాపర్టీల ప్రత్యక్ష ఫొటోలు తీసి.. వాటిని జియో ట్యాగింగ్ చేసి సదరు ప్రాపర్టీ యజమానులకు పంపిస్తుంటాం. ప్రస్తుతం 1100 మంది ఎన్ఆర్ఐలు మా ల్యాండ్గార్డ్ సేవలను వినియోగించుకుంటున్నారు.
రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యం..
మైఓఎస్ ప్రాపర్టీ యాప్ మీద సుమారు 50 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి సుమారు 10 లక్షల డౌన్లోడ్స్కు చేరుకుంటాం. వచ్చే ఏడాది కాలంలో వంద నగరాలకు, రూ.100 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్నది మా లక్ష్యం.