స్థిరాస్తి కొనుగోలుదారుకు భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ, తెలంగాణలో దీని అమలు పూర్తి స్థాయిలో కావటంలేదు. పునాది పడే ప్రతి ప్రాజెక్ట్, లే–అవుట్ విధిగా రెరాలో నమోదు కావాల్సిందేనని చట్టం చెబుతున్నా డెవలపర్లు పట్టించుకోవడంలేదు. 2017లో రెరా చట్టం మనుగడలోకి వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 2500 ప్రాజెక్టులు మాత్రమే రిజిస్టరయ్యాయి.
నిర్లక్ష్యం..
రాష్ట్రవ్యాప్తంగా 6వేల ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణ స్థానిక సంస్థలు ఆమోదముద్ర వేస్తే అందులో 2500 మాత్రమే రెరాలో నమోదు చేసుకోవడం చూస్తే ‘రెరా’ అమలులో పురపాలక శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
జరిమానాతో వెసులుబాటు..
స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలో పేర్లను నమోదు చేసుకోని సంస్థలపై కొరడా ఝళిపించాల్సిన సర్కారు.. జరిమానాలతో సరిపెడుతోంది. రూ.3 లక్షల పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో పేరు నమోదు చేసుకోకున్నా ఏం కాదులే అన్న నిర్లక్ష్యం రియల్టీ కంపెనీలల్లో కనిపిస్తోంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ వంటి అధికారిక సంస్థల నుంచి అనుమతి పొందిన స్థిరాస్తి సంస్థలు గతేడాది నవంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రెరాలో నమోదు చేసుకునే అవకాశం కల్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ తర్వాత 50 వేల జరిమానాతో గడువు ఇస్తే 50 సంస్థలు ముందుకు రాగా.. రెండోసారి రూ.3 లక్షల పెనాల్టీతో పేర్ల నమోదుతో అవకాశం కల్పించినా ముందుకు రావడం లేదు.
అవగాహనాలోపం..
వినియోగదారులకు విశ్వాసం, నమ్మకం కలిగించేందుకు వీలుగా రెరాను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 500 చదరపు అడుగులు పైబడిన స్థలం, 8 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తప్పనిసరిగా రెరాలో నమోదుచేసుకోవాలనే నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70 శాతాన్ని ప్రత్యేక అకౌంట్లో జమ చేయాలనే నిబంధన ఉండడంతో రియల్టర్లు రెరాలో నమోదుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా కొనుగోలుదారులకు భరోసా ఇచ్చేలా.. డెవలపర్లు విధిగా పాటించేలా కొన్ని నిబంధనలు పకడ్బందీగా ఉండడం కూడా వారి వెనుకడుగుకు కారణంగా కనిపిస్తోంది.
నమోదయ్యాకే విక్రయం..
రెరాలో నమోదు అనంతరమే స్థలాలు, ఫ్లాట్లు విక్రయాలకు సంబంధించిన ప్రచారం నిర్వహించుకోవాలనే షరతు విధించింది. ఈ మేరకు పత్రికా, ప్రసారమాధ్యమాల్లో రెరా రిజిష్టర్ నంబర్ను ప్రచురించాలని స్పష్టం చేసింది. అయితే, కేవలం బడా సంస్థలు మినహా మధ్యతరగతి రియల్టీ కంపెనీలు ఈ నిబంధనలు పాటించడంలేదు. భూమి పూజ చేసిందే మొదలు.. ప్లాట్ల బేరాలను సాగిస్తున్నాయి. మరోవైపు బహుళ అంతస్తు భవనాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేస్తున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, తదితర సంస్థల సమన్వయం కొరవడడం కూడా రెరాలో పేర్లు నమోదు కాకపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. రెరాకు తగినంత స్టాఫ్ లేకపోవడం.. ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం లేకపోవడం ఈ పరిస్థితికి దారితీస్తోంది. మరో ముఖ్యవిషయమేంటే.. ప్రజలకు అవగాహన కల్పించడంలోను పురపాలకశాఖ చేతులెత్తేసింది. రెరా ఆవశ్యకత, చట్టబద్ధత, ప్లాట్ల క్రయవిక్రయాల్లో ఈ చట్టం ఏ రకంగా ఉపయోగపడుతుందనే అంశంపై చైతన్యం కల్పించడంగానీ, ప్రచారం కాని చేయకపోవడంలో విఫలమైంది. దీంతో ఈ చట్టంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవగాహన లేకుండా పోయింది.