రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ శాఖల్లో పనిచేస్తున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల కోసం గండిపేట మండలం మణికొండ జాగీర్ పరిధిలోని సర్వే నంబర్లు 203/పీ, 204,205, 208,209లలో 50 ఎకరాలను ప్రభుత్వం 2003లో హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగుల సహకార హౌజింగ్ సొసైటీ (టీఎన్జీవోస్)కు కేటాయించింది. అయితే, ఈ సొసైటీ ఇండ్ల స్థలాల కేటాయింపు ఆది నుంచి వివాదాస్పదంగానే మారింది. సొసైటీ పాలకమండలి తీరు మొదటి నుంచీ అక్రమంగానే కొనసాగడంతో అడ్డగోలు కేటాయింపులు జరిగాయనే ఆరోపణలున్నాయి. సొసైటీ నిబంధనల ప్రకారం నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే సొసైటీ సభ్వత్యం ఇవ్వాల్సివుంటుంది. కానీ, ఇవేమి పట్టించుకోని పాలక కమిటీ అడ్డగోలుగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. నచ్చిన, మెచ్చిన వారిని సభ్యులుగా చేర్చుకొని స్థలాలు కేటాయించారని, ఇందులో నాన్ గెజిటెడ్ ఉద్యోగులే గాకుండా.. గెజిటెడ్ అధికారులకు కూడా స్థలాలను ధరాదత్తం చేశారన్న ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. ఇలా ఈ సొసైటీలో స్థలాలు పొందినవారిలో మాజీ, ప్రస్తుత కలెక్టర్లు కూడా ఉండడం గమనార్హం. సీనియారిటీని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోగా… విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగులకు కేటాయించిన స్థలాలను రద్దు చేసి మరొకరి కేటాయించిన దాఖలాలున్నాయి. ఇవేగాకుండా తమ కనుసన్నల్లో పనిచేసిన వారికి.. ముట్టజెప్పినవారికి మాత్రమే ప్లాట్లు దక్కాయి. ఒకే ప్లాటు ఇద్దరికి కేటాయించడం ద్వారా వివాదాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. సభ్యుల నుంచి నాలుగేసి లక్షల వరకు వసూలు చేయడం ద్వారా రూ.20 కోట్ల మేర అనధికారింగా రాబట్టినట్లు స్పష్టమైంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. సొసైటీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు వచ్చిన అధికారులకు కూడా స్థలాలను కట్టబెట్టారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఆర్థం చేసుకోవచ్చు. కాగా, తాజాగా త్వరలో ఈ సొసైటీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. సొసైటీ సభ్యుల మధ్య ఆధిపత్యపోరుకు దారితీసింది. వైరివర్గాన్ని దెబ్బతీసేందుకు మద్దతుదారుల ఓట్లను తొలగించడంతో సొసైటీ రాజకీయం రచ్చకెక్కింది.
అండా..దండా..!
సీబీఐ లేదా ఏసీబీతో దర్యాప్తు చేయించాలని ఏకంగా జిల్లా కలెక్టర్ లేఖ రాసి ఎనిమిది నెలలైనా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ భూ బాగోతం వెనుక పెద్దల హస్తం ఉందని స్వయానా నివేదికలో పేర్కొన్నా.. కూడా విచారణ ముందుకు సాగకపోవడానికి గతంలో ఉద్యోగ సంఘాల్లో కీలకపాత్ర పోషించి సచివాలయంలో చక్రం తిప్పుతున్న ఓ అధికారే కారణమనే ప్రచారం జరుగుతోంది.
అక్రమాల పుట్ట.. సొసైటీ చిట్టా
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం… వాస్తవానికి సొసైటీకి భూమిని అప్పగించిన అనంతరం ఆ సొసైటీ భూ బదలాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆ భూమి సొసైటీ పేర బదలాయించబడుతుంది. ఆ తర్వాత సొసైటీ లేఅవుట్ ప్లాన్ తయారు చేసి హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్న తర్వాతే.. అర్హులైన ఉద్యోగులకు ప్లాట్లను కేటాయించాల్సివుంటుంది. కానీ, కనీసం బదలాయింపు ప్రతిపాదనలు కోరకుండా… హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికన పేరుతో 2004 నుంచే స్థలాల కేటాయింపు ప్రారంభించారు. ఈ ప్లాట్ల కేటాయింపు కూడా అడ్డగోలుగా జరిగింది. సభ్యుల సీనియారిటీని పట్టించుకోకుండా..అర్హులకు ఆర్థిక నష్టం కలిగిస్తూ ఇష్టారీతిన కేటాయింపు జరిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ సొసైటీలో ప్లాట్లు పొందేందుకు అర్హులు కాగా, ప్రభుత్వ నిబంధనలు, సొసైటీ మార్గదర్శకాలను ఉల్లంఘించి అర్హతలేని ఆనేక మందికి ప్లాట్లను కట్టబెట్టారు. ఈ హౌజింగ్ సొసైటీ ఆవిర్భావ స్ఫూర్తి అయిన ఎన్జీఓలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని పక్కదోవ పట్టిస్తూ 2008, నవంబర్ 8న ఏకంగా సొసైటీ నియమావళినే మార్చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉండి..రంగారెడ్డి కేంద్రంగా హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుపీరియర్ ఉద్యోగులై ఉండాలనే అర్హతను చేర్చారు. ఇది ఎన్జీఓల హక్కులను కాలరాస్తూ.. ఎన్జీఓలకు ప్లాట్ల కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన సొసైటీలో కనీసం వారికి సభ్యత్వం పొందే అవకాశం కూడా లేకుండా చేశారు.
ఎప్పుడు.. ఏం జరిగిందంటే?
– ఈ సొసైటీ గండిపేట మండలం మణికొండ జాగీర్ పరిధిలోని సర్వే నంబర్లు 203/పీ, 204,205, 208,209లలో 50 ఎకరాలను ప్రభుత్వం 2003లో కేటాయించింది. అప్పటి నుంచి ఆరేళ్లపాటు సొసైటీ ద్వారా సభ్యులకు ప్లాట్ల కేటాయింపులు జరిగాయి.
– అయితే, సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సొసైటీ తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అప్పటి జిల్లా సహకార అధికారిని విచారణాధికారిగా నియమించింది.
– ఆరు నెలలకు కూడా ఏలాంటి నివేదిక రాకపోవడంతో 19 కాలమ్ల ఫార్మాట్లో వివరాలు సమర్పించాలని లేదంటే భూ కేటాయింపు రద్దు చేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు డీసీఓ పంపిన ఫార్మాట్లో రికార్డుల్లేవని సర్చార్జి కేసులో సికింద్రాబాద్ డివిజనల్ సహకార అధికారి ఆధీనంలో రికార్డులున్నాయని, సొసైటీ అధ్యక్షుడు వివరణ ఇచ్చారు.
– దాని తర్వాత పలుమార్లు వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించినా.. సొసైటీ నుంచి ఏలాంటి స్పందన రాలేదు. మూడు రోజుల్లో వివరాలు ఇవ్వకుంటే కేటాయింపు రద్దు చేస్తామంటూ 2017 మేలో షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించలేదు. దీంతో 2017 డిసెంబర్లో సొసైటీ సమావేశం జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశం మినిట్స్ ఆధారంగా ఐదు అంశాలతో ఒక నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సొసైటీ అక్రమాలు వెలుగు చూశాయి. దీనిపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఏకంగా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తుది నివేదికలోని అంశాలివి..
ఈ సొసైటీ ద్వారా స్థలాల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు, ఆర్థిక దుర్వినియోగం, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. అనర్హులకు సీనియారిటీని విస్మరించి ప్లాట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక రికార్డులు కూడా నిర్వహించలేదు. ఇందుకు సొసైటీ మేనేజింగ్ కమిటీయే కారణం. పాలకమండలి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా వ్యవహరించింది. ఈ అక్రమాల వెనుక బడా బాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీకి వారి నుంచి ఉన్న అండ కారణంగా ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆర్థమవుతోంది. సొసైటీ ద్వారా స్థలాల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కేసును ఏసీబీ లేదా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలి. కమిటీ సభ్యులతోపాటు ఏలాంటి టైటిల్ డీడ్స్ లేకుండా అక్రమంగా భవన అనుమతులిచ్చిన గ్రామ పంచాయతీపై కూడా చర్యలు తీసుకోవాలి. అనర్హులకు అక్రమంగా కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలి