గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకొని ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నగరీకరణ దిశగా మారుతొంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సగం ప్రాంతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. దీనికి తొడు కొత్తగా నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు (నగరపాలక సంస్థలు), తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో.. పూర్తిగా నగరీకరణ దిశగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా మారిందని చెప్పవచ్చు.
మున్సిపాలిటీలు కార్పోరేషన్స్గా..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లి గ్రామ పంచాయతీలను వీలినం చేస్తూ నిజాంపేట్ మున్సిపాలిటిగా ప్రకటించిన ప్రభుత్వం ఈ మున్సిపాలిటిని మళ్లీ అప్గ్రేడ్ చేస్తూ మున్సిపల్ కార్పోరేషన్గా ప్రకటించారు. ఇదే నియోజకవర్గంలోని దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహూదూర్పల్లి గ్రామాలను విలీనం చేస్తూ దుండిగల్ మున్సిపాలిటీగా, కొంపల్లి, దూలపల్లి గ్రామ పంచాయతీలను కలుపుతూ కొంపల్లి మున్సిపాలిటి ఏర్పాటు చేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహార్నగర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అప్గ్రేడ్తో మున్సిపల్ కార్పోరేషన్గా మార్చింది. చెంగిచెర్ల, బోడుప్పల్ గ్రామ పంచాయతీలను కలిపి బోడుప్పల్ మున్సిపాలిటీ మార్చిన ప్రభుత్వం మున్సిపల్ కార్పోరేషన్గా అప్గ్రేడ్ చేసింది. పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వాతాపూర్ గ్రామ పంచాయతీలను కలుపుతూ పీర్జాదిగూడ మున్సిపాలిటీగా మార్చిన ప్రభుత్వం మున్సిపల్ కార్పోరేషన్గా అప్గ్రేడ్ చేసింది.
పంచాయతీలు మున్సిపాలిటీలుగా..
మేడ్చల్, అత్వేల్లి గ్రామ పంచాయతీలను కలుపుతూ మేడ్చల్ మున్సిపాలిటిగా, ఘట్కేసర్ ,కొండాపూర్, ఎన్ఎఫ్సీనగర్ గ్రామాలను కలుపుతూ ఘట్కేసర్ మున్సిపాలిటిగా, పోచారం, ఇస్మాయిల్ ఖాన్ గూడ, నారపల్లి, యన్నంపేట్ గ్రామాలను కలుపుతూ పోచారం మున్సిపాలిటిగా ఏర్పడ్డాయి. అలాగే, దమ్మాయిగూడ, అహ్మాద్గూడ, కుందనపల్లి గ్రామాలను కలుపుతూ దమ్మాయిగూడ మున్సిపాలిటిగా, నాగారం,రాంపల్లి గ్రామాలను కలుపుతూ నాగారం మున్సిపాలిటిగా, గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసీరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ గ్రామాలను కలుపుతూ గండ్లపోచంపల్లి మున్సిపాలిటిగా, దేవరయాంజల్, ఉప్పరపల్లి గ్రామాలను కలుపుతూ తూముకుంట మున్సిపాలిటిగా ఏర్పాటు చేశారు.
అభివృద్ధిపై కొత్త ఆశలు..
జిల్లాలో కొత్తగా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పడటంతో ఈ పట్టణాలు నలువైపులా అభివృద్ధి చెందటానికి అవకాశముంది. దీంతో వినోదం, పర్యాటక, పారిశ్రామిక, వ్యాపారం, వాణిజ్య ,రియల్ ఏస్టేట్ రంగాల అభివృద్ధితోపాటు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా పెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుబంధ సేవా రంగం అభివృద్ధితో పాటు అనువుగా ఉన్న జాతీయ రహాదారి, దాని సమీంపలోని ఔటర్ రింగ్ రోడ్, ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల విస్తరణతో నిర్మాణ రంగం అభివద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.
ఉపాధిలోనూ వృద్ధి..
జిల్లాలో ఇప్పటికే 63 భారీ పరిశ్రమలు, 23,961 సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలు ఉండగా, ఇందులో 3,30,055 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. ఈ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్లో 40 నుంచి 50 శాతం మంది ఈ నాలుగు మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో నివాసముంటున్నారు. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండటంతో కొత్తగా 46,356 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. బోడుప్పల్లోని 360 ఎకరాల్లో ఐటీఐఆర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లయితే బోడుప్పల్, పీర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పోరేషన్లు మరింత అభివృద్ధి దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయి.