అమెరికాలోని డాలస్ నగరంలోని అల్లెన్ ఈవెంట్ సెంటర్లో భగవద్గీత పారాయణం జరిగింది. శ్రీ దత్త పీఠాథిపతి గణపతి సచ్చిదానంద స్వామి సారథ్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మక కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. తొలుత అల్లెన్ ఈవెంట్ సెంటర్కు విచ్చేసిన స్వామీజీకి దత్త యోగా సెంటర్, గీతా టీమ్ సభ్యులు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన స్వామీజీ శ్రీకృష్ణ భగవానుడికి పూజలు నిర్వహించి సహస్ర గళాన్ని ఆరంభించారు. ఒకే వేదికపై నుంచి వేల మంది భగవద్గీత శ్లోకాలను పఠించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోగా దీనికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని గణపతి సచ్చిదానంద స్వామీజికి ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా భగవద్గీతను పఠించేలా పిల్లల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు స్వామీజీ ఆశీస్సులు తెలిపారు. పిల్లలకు ఇదే గొప్ప బహుమతి అని అన్నారు. ఈ కార్యక్రమానికి 1500 మందికి పైగా హాజరై సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు.
