నటుడు తారకరత్న పార్థివ దేహాన్ని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. భౌతిక కాయంతో కుటుంబీకులు, అభిమానులు, బాలయ్య, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఫిల్మ్ ఛాంబర్ కి తరలి వెళ్లారు. ఫిల్మ్ ఛాంబర్ లో మధ్యాహ్నం 3 గంటల వరకూ వుంచనున్నారు. సాయంత్రం 5 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు తారకరత్న పార్థివ దేహానికి మంత్రి తలసాని ఫిల్మ్ ఛాంబర్ లో నివాళులు అర్పించారు. అలాగే అభిమానులు, సినిమా ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు.
తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్ చానల్ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. కాగా.. శివరాత్రి రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.