శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళ పత్రాల డిజిటైజ్ కార్యక్రమం నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్వీ గోసంరక్షణ శాలలో నిర్మిస్తున్న నెయ్యి తయారీ ప్లాంట్ భవనాలు, యంత్రాల ఏర్పాటు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఆయన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ శాస్త్రాన్ని, అందులో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రసారం చేసిన యోగ దర్శనం కార్యక్రమానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన చెప్పారు.
యోగ వల్ల కలిగే ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతను వివరించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
ఇంకా వెలుగులోకి రాని తాళపత్రాలను స్కానింగ్ చేసే ప్రక్రియను వేద విశ్వవిద్యాలయం వేగవంతం చేయాలన్నారు. ఎస్వీబీసి యూట్యూబ్ లో ఆరోగ్యం, ఆహారం, జ్ఞానం, విజ్ఞానానికి సంబంధించి అంశాలపై నిపుణుల చేత ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలన్నారు. టీటీడీలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లను త్వరగా ఖరారు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఈవో చెప్పారు. తిరుమలలో ఉద్యానవనాల నిర్వహణ మరింత ఆకర్షణీయంగా ఉండాలని, కొత్తగా ఉద్యానవనాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమి చదును కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బర్డ్ ఆసుపత్రిలో స్మైల్ ట్రైన్, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను ప్రజలకు మరింత చేరువ చేయాలని శ్రీ ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రవణం ప్రాజెక్టును ఇకపై బర్డ్ ద్వారా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.