సీఎం జగన్ పాల్గొన్న బహిరంగ సభలో ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని తీవ్ర భావోద్వేగయ్యారు. ముఖ్యమంత్రి గురించి చెబుతూ కన్నీటిని అదుపు చేసుకున్నారు. తాను జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని, మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ రాజకీయ జీవితం, మంత్రి పదవి జగన్ పెట్టిన భిక్ష అని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జగనన్న ఆరోగ్య సంస్కర్త అని రజని కొనియాడారు. పేదల గుండెల్లో నిలిచిన నేత అని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు ఇక్కడి ప్రజల తరపున పాదాభివందనాలతో స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలతో జగన్ చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు.
‘చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెబుతున్నా. నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి జగనన్న పెట్టిన భిక్షే. సాధారణ బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రిని చేశారు. జగనన్నా.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా.. మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను’ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు.