వచ్చే ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేస్తామని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని చెప్పారు. తాము 15 స్థానాలను గెలిచినా బీఆర్ఎస్కు మద్దతిస్తామని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు.
