బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. బీఆర్ఎస్ ఎంపీలు ఇలా చేయడం సిగ్గు చేటని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రపతి రాజకీయ నేత కాదని, రాష్ట్రపతి ప్రసంగం విన్న తర్వాత ఎవరూ బహిష్కరించరని అన్నారు. అయితే.. ఏవైనా అంశాలుంటే… రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం సమయంలో చెప్పే ఛాన్స్ వుంటుందన్నారు. సంచలనం కోసమే వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆరోపించారు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదన్న విషయం వారు మర్చిపోయారని విమర్శించారు.
పార్లమెంటులో సహృద్బావ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలంటే ద్వేషమని, ఆదివాసులు, మైనారిటీలు అంటే ద్వేషమని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని మొదటి ప్రభుత్వంలో మహిళా నేతలే లేరని, మహిళా కమిషన్ కూడా లేదని బండి సంజయ్ గుర్తు చేశారు. కేసీఆర్ మహిళా గవర్నర్ ను అవమానిస్తున్నారన్న బండి.. హైకోర్టులో ఆమెపై కేసు ఎందుకు వేశారో తెలియక జనాలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ అంటే వారికి గౌరవం లేదని… వాస్తవాలు మాట్లాడితే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. తెలంగాణలో రాచరికం నడుస్తోందని, కేటీఆర్ పర్యటిస్తుంటే బీజేపీ, ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణపై వివరణ ఇచ్చిన కేశవరావు
జాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. తమకు రాష్ట్రపతి ముర్ముపై గౌరవం వుందని, తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్లో ఎండగడుతామని ప్రకటించారు. అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పామని, గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపకపోతే ఎలా అని కేకే ప్రశ్నించారు.