శాసనసభ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేదికగా మార్చుకుందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శించారని మండిపడ్డారు. అసలు ప్రజలకు ఏం చేయాలో ఉభయ సభలూ చర్చించనే లేదని, కేవలం కేంద్రంపై విమర్శలకే సరిపెట్టుకున్నారని అన్నారు. శాసనసభ సమావేశాలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ప్రధాని మోడీని, కేంద్రాన్ని టార్గెట్ చేసి.. శాసనసభ వేదికగా విమర్శలు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లు వేరు కాదన్న ఆయన.. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ తండ్రీ, కొడుకులు చదివారని ఆరోపించారు. ప్రధాని మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తుంటే… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తున్నారన్నారని, ఇంత కంటే ఏం కావాలన్నారు. అసలు సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించే ధైర్యం కేసీఆర్కు లేదన్నారు.