క్రిస్టియన్ సమాజం, సంఘాల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరఫున క్రైస్తవ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ పై ప్రకటన చేశారు.
చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్న విషయాన్ని క్రైస్తవ సంఘాలు సీఎంకి నివేదించాయి. అలాగే ఛారిటీ సంస్థలు నడుపుతున్న వారికి స్థానిక పన్నుల నుంచి మినహాయింపు కావాలని క్రైస్తవ సంఘాల నేతలు సీఎం జగన్ ని కోరారు. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యచరణకు దిగుతామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. సలహాదారులను నియమించడం ద్వారా సమస్యలను పరిష్కరించడనికి వీలవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.