వరద బాధితులందరికీ తాము అండగా వుంటామని, భయపడాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలన్నింటికీ మంచి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని సీఎం భరోసా ఇచ్చారు. సీఎం జగన్ మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పి. గన్నవరం మండలం గంటిపెదపూడి లంక గ్రామంలో ఇంటింటికీ తిరిగి, సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించారు. ఏ ఒక్క వరద బాధితుడికి కూడా సహాయం అందలేదు అన్న పేరు ప్రభుత్వానికి రాకూడదని, వెంటనే సహాయం అందివ్వాలని అక్కడే అధికారులను ఆదేశించారు. ఇక… గంటి పెదపూడి లంక గ్రామానికి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం అతి త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో సచివాలయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక… తమకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలని ప్రజలు అడగ్గా… సీఎం జగన్ ఓకే చెప్పారు.
ఇక… వర్షంలోనూ సీఎం జగన్ తన పర్యటనను కొనసాగించారు. సాయం ఎలా అందుతోంది? అధికారులు స్పందిస్తున్నారా? అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల పనితీరును కూడా ప్రజల దగ్గరి నుంచి అడిగి తెలుసుకున్నారు. తనది ప్రచార ఆర్భాటం కాదని, తాను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫొటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే, టీవీల్లో కనిపించేవాడినని అన్నారు. కానీ… దాని వల్ల నిష్ప్రయోజనం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. సీఎం అనే వ్యక్తి వ్యవస్థలను నడిపించాలని, ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. సరైన సమయంలో సరైన సహాయం అందేలా చూసే బాధ్యత సీఎందేనని అన్నారు. సహాయ కార్యక్రమాలకు, పనులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే వారం రోజుల తర్వాత వరద ప్రాంతాలకు వచ్చానని సీఎం జగన్ వివరణ ఇచ్చారు.