ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఎంత పంట వేశారు..ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. గంటలో ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు.
వాస్తవానికి రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని.. సహాయ పునరావాస చర్యలు అని అంటారని చెప్పారు.గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. అయితే… కేంద్రానికి ఎలాంటి నివేదికా పంపమని, పూర్తిగా తామే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారని తెలిపారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారని, ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారని మండిపడ్డారు. కానీ తాము గర్వంగా చెబుతున్నామని, ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్వన్గా ఉందని ప్రకటించారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందన్నారు.