ఆగస్టు 8 నుంచి 22 వరకూ జరిగే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేవించారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. వజ్రోత్సవాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
దేశ సమైక్యత, దేశ భక్తిని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు.