BBC కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబైలోని BBC కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. దాడుల సందర్భంగా అక్కడి పాత్రికేయుల ఫోన్లను ఐటీ అధికారులు తీసేసుకున్నారు. ఇళ్లకు వెళ్లిపోవాలని కూడా సూచించారు. ఫోన్లతో పాటు సిస్టమ్ లను కూడా ఐటీ అధికారులు తీసేసుకున్నారు. అయితే…. ఇవి సోదాలు కాదని, పన్నుల అవకతవకల ఆరోపణలకు సంబంధించి సర్వే మాత్రమేనని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చెల్లింపుల రికార్డులను ఐటీ పరిశీలిస్తోంది. పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. అకౌంట్ బుక్స్ను చెక్ చేస్తున్నామని, తనిఖీలు నిర్వహించడంలేదన్నారు. సిబ్బంది బయటకు వెళ్లవద్దు అని అధికారులు ఆదేశించారు. ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 20 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
पहले BBC की डॉक्यूमेंट्री आई, उसे बैन किया गया।
अब BBC पर IT का छापा पड़ गया है।
अघोषित आपातकाल
— Congress (@INCIndia) February 14, 2023
అయితే… ఈ సోదాలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తాము అదానీ గ్రూపు విషయంలో వచ్చిన నివేదికపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ… ప్రభుత్వం బీబీసీ వెంట పడిందని మండిపడింది. బీబీసీ ఆఫీసుపై ఐటీ శాఖ రెయిడ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆ పార్టీ తన ట్విట్టర్లో ఆరోపించింది. తొలుత బీబీసీ డాక్యుమెంటరీ రిలీజైందని, ఆ తర్వాత దాన్ని బ్యాన్ చేశారని, ఇప్పుడు బీబీసీఐ ఐటీ దాడులు మొదలుపెట్టారని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆ పార్టీ తన ట్విట్టర్లో విమర్శలు చేసింది.
అయితే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారత్ లో పనిచేస్తున్న ఏ మీడియా సంస్థ అయినా… దేశంలోని నియమ నిబంధనలను ఫాలో కావాల్సిందేనని అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. చట్ట ప్రకారమే ఐటీ శాఖ బీబీసీ లో సోదాలు చేస్తోందని, ఐటీ పంజరంలోని చిలుక కాదన్నారు. కాంగ్రెస్ ఎజెండా, బీబీసీ ఎజెండా రెండూ సమానమేనని విరుచుకుపడ్డారు. బీబీసీ అంటే భ్రష్ట్, బక్వాస్ కార్పొరేషన్ అని అభివర్ణించారు. భారత్ లో జర్నలిజం చేయడానికి బీబీసీకి అన్ని హక్కులున్నాయని, అయితే… భారత చట్టాలను మాత్రం అనుసరించాల్సిందేనని భాటియా పేర్కొన్నారు.