తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో 17న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో, సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
