ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ద రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో బయల్దేరారు. అవి బయల్దేరడానికి ముందు సంప్రదాయం ప్రకారం పూరీ మహారాజు దివ్యసింగ్ దేవ్ ఆ మూడు రథాల ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం రథాలు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్, గుండిచా మందిరం వైపు కదిలాయి. ఈ రథయాత్రలో కేంద్రమంత్రులు, అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుకలను భక్తులు తిలకించలేకపోయారు. ఈసారి అనుమతించడంతో పూరీ నగరానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు.
