హిండెన్ బర్గ్ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ ప్రైజేస్ నుంచి సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ శుక్రవారం ఏకంగా 30 శాతం నష్టపోయింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ 115 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూపు కంపెనీల్లో ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ హిండెన్బర్గ్ నివేదికకు ముందు 217 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 102 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక అదానీ పోర్ట్స్ ఎస్ఈజడ్ లిమిటెడ్ 6 శాతం నష్టపోగా, అదానీ ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ కంపెనీలు పది శాతం చొప్పున పతనమయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం నష్టపోయింది.
మరోవైపు అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోవడంతో ఈ గ్రూపునకు రుణాలిచ్చిన బ్యాంకులను పూర్తి వివరాలు అందచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరింది. గత 10 రోజుల్లో అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గిపోయింది. మొన్నటి దాక ఫోర్బ్స్ ప్రపంచం సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు(ఫిబ్రవరి 2న) 22వ స్థానానికి పడిపోయారు.
అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో గురువారం ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో ముగిశాయి. మిగతా ఎనిమిది కంపెనీల షేర్లు 4.98 శాతం నుంచి 26.50 శాతం వరకు నష్టపోయాయి. కొన్ని కంపెనీల షేర్లయితే గురువారం ఉదయం లోయర్ సర్క్యూట్ బ్రేకర్ను తాకాయి. ఎఫ్పీఓను వెనక్కి తీసుకున్నా, గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) కౌంటర్లో అమ్మకాల హోరు ఏ గమాత్రం తగ్గలేదు. గురువారం ఈ కంపెనీ షేర్లు మరో 26.50 శాతం నష్టపోయి రూ1,564.70 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రా డేలో ఒక దశలో 28.88 శాతం పడిపోయి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి.