మెడికో ప్రీతి మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మరణించడం బాధాకరమన్నారు. హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేవారు. అయితే..ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని, నిందితులు ఎవరైనా.. సైఫ్ అయినా.. సంజయ్ అయినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డామని, మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారని కేటీఆర్ గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ, స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదని, ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేశారు అని కేటీఆర్ నిలదీశారు. 24 గంటల కరెంట్ రైతులకు ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు బీమా కల్పించాలనే ఆలోచన ఎందుకు రాలేదు? కరెంట్, సాగు, తాగు నీరు ఇవ్వరు.. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.