బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులివ్వడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే… ఇప్పటికే షెడ్యూల్ ప్రకార కార్యక్రమాలు వున్నందున ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది మాత్రం ఇంకా ఉత్కంఠగానే వుంది. ఈ నెల 10న జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ధర్నా చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం రెండు రోజుల ముందే ఢిల్లీకి పయనమవుతున్నట్లు కవిత ముందే తెలిపారు.
మరోవైపు ఢిల్లీకి బయల్దేరే ముందే కవిత సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కవితకి సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీజేపీపై న్యాయపరంగా పోరాడదామని అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ అన్ని రకాలుగా అండగా వుంటుందని, షెడ్యూల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొన్ని అపాయింట్స్, కార్యక్రమాలు వున్నాయని, రేపటి విచారణకు హాజరు కావాలా లేక నోటీసులపై లేఖ రాయాలా అనేది న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టామని.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఢిల్లీలో దీక్ష కోసం మార్చి 8వ తేదీనే ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే ఈలోపే ఈడీ నోటీసులు రావటంతో.. ముందస్తు కార్యక్రమాలపై పార్టీలోనూ.. న్యాయ నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని కవిత స్పష్టం చేశారు.