సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మున్సిపల్, ఐటీ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి పూర్తిగా వివరిస్తూ ఈ ట్వీట్ వుంది. తాము చేపట్టిన పారిశ్రామిక విధానాలతో మంచి ఫలితాలను సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర పరిశ్రమల శాఖ నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల విద్యుత్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతు బంధులో భాగంగా రైతులకు ఇప్పటి వరకూ 57,956 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు.
ఇక మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ కూడా చేశారు. కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కు రాబోతున్న వాట్సాప్ యూనివర్శిటీకి స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బిర్యానీ తినడం, ఇరానీ చాయ్ తాగడం మరవొద్దని అన్నారు. తమ పథకాలను బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయాలన్నారు.