హైదరాబాద్ లో మళ్లీ ఫ్లెక్సీల వార్ ప్రారంభమైంది. ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు..? అంటూ పోస్టర్లులో పేర్కొన్నారు. 2018, మే, 5వ తేదీన ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తైన 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ పోస్టర్లలో తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. అయితే… మోదీకి వ్యతిరేకంగా ఎవరు ఈ పోస్టర్లను అతికించారో మాత్రం తెలియరాలేదు. మోదీ గారూ… ఈ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్ని సంవత్సరాలు? తీవ్ర ఇబ్బందులు పడుతు్ననాం అంటూ దారిపోడువునా కనిపిస్తున్నాయి.
భారత్మాల ప్రాజెక్టు కింద ఉప్పల -నారపల్లి ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. అయితే ఐదేండ్లు అయినా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు 40 శాతం వర్క్ కూడా పూర్తి కాలేదన్న విమర్శలు వున్నాయి. మరోవైపు.. ఉప్పల్, నారపల్లి మధ్య ఉన్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టరే కారణమని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇటు కేటీఆర్ కు కూడా దీనిపై రిప్లై ఇచ్చారు. చాలామంది ఈ ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది భావిస్తున్నారని, కానీ… ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.