ముంబై తర్వాత దేశంలో తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రాధాన్యం
హైదరాబాద్! కేవలం ప్రవాసాంధ్రులే కాకుండా ప్రవాస భారతీయులు సైతం ఇప్పుడు తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దక్షిణాదిలో ఈ రాష్ట్రానికి బెంగళూరు కంటే ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం, ఐ.టి కంపెనీలను ప్రారంభించడం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేపట్టడం వరకు అటు ప్రవాస భారతీయులు, ఇటు ప్రవాసాంధ్రులు తెలంగాణ రాష్ట్రానికి, అందులోనూ హైదరాబాద్కు అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సుమారు 1,12,000 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు హైదరాబాద్ నగరానికి రానున్నాయని అంచనా.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువైన గృహ నిర్మాణాలు హైదరాబాద్లోనే కాక, ఇతర ప్రాంతాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు నగరం మాత్రమే కాక, చెన్నై సైతం పెట్టుబడులు, నిర్మాణాలు, కంపెనీల స్థాపన విషయాల్లో అభిలషణీయ స్థాయికి, గరిష్ట స్థాయికి చేరుకుని క్రిక్కిరసిపోవడంతో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న, పారిశ్రామిక దేశాల దృష్టి క్రమంగా దక్షిణాదిలో మరొక అత్యంత ప్రధాన నగరమైన హైదరాబాద్ మీద పడుతోంది.
తాజాగా ఆమెజాన్ వెబ్ సర్వీసెస్, టెస్లాలు హైదరాబాద్లో తమ సంస్థలను స్థాపించి సేవలను విస్తరించడానికి సుమారు 35,000 కోట్ల రూపాయల మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదర్చుకున్నాయి. వీటివల్ల సుమారు 10 వేల మంది విద్యాధిక యువతీ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి లభించే అవకాశం ఉంది. రానున్న ఒకటిన్నర సంవత్సరాల కాలంలో హైదరాబాద్, వరంగల్ నగరాలతో పాటు, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు ఐ.టి, అపేరల్, ఫార్మా రియల్ ఎస్టేట్ హబ్లుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.
కేవలం ప్రవాసులే కాకుండా, అదానీ, అంబానీ, టాటా వంటి దేశ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజాలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు ఖరారు చేసుకుని, సంస్థాపన ఏర్పాట్లను చేపట్టాయి. రాష్ట్రంలో బహుళ ప్రయోజనకర వెబ్ సెంటర్లను ప్రారంభించడినికి ఆమెజాన్ వెబ్ సర్వీసెస్ సుమారు 20,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది. దీనివల్ల వేల సంఖ్యలో యువతీ యువకులకు కొత్తగా ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఈ వెబ్ సెంటర్లలో మల్టిపుల్ డేటా సర్వీసులు లభిస్తాయి. ఒక దక్షిణాది రాష్టంలో ఆమెజాన్ ఇంత పెద్దయెత్తున పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఇది చాలా అరుదైన విషయం. ముంబై తర్వాత హైదరాబాద్లో మాత్రమే ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది.
కొత్త కంపెనీలు, సేవల ప్రవేశం వల్ల రాష్ట్రంలో సుమారు 87,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రధాన కంపెనీలతో పాటు, వాటికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం, స్టానిక కంపెనీలు ఏర్పాటు చేయబోయే సంస్థల వల్ల తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలావరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసుల కోసం అనేక రాయితీలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దావోస్లో జరిగిన ఆర్థిక సదస్సు సందర్బంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరిపి, పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తమ రాష్ట్రంలో తాము కల్సిస్తున్న రాయితీలు, ఇస్తున్న వెసులుబాట్ల గురించి వివరంగా తెలియజేసింది.
రాష్ట్ర సాంకేతీక పరిజ్ఞాన శాఖ మంత్రి ౩. తారక రామారావు నాయకత్వంలోని ఒక బృందం వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో చర్చించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్లడానికి గల అవకాశాలకు వారి నుంచి పూర్తి సానుకూలత లభించినట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ వంటి ప్రాంతాలు, హైదరాబాద్ నగరం రూపురేఖలు వచ్చే నాలుగైదేళ్లలో పూర్తిగా మారిపోనున్నాయని ఆశించవచ్చు.