రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశిస్తూ పుతిన్ పై వ్యాఖ్యలు చేశారు. పశ్చిమదేశాలు డర్టీ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని, తూర్పు దేశాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఉక్రెయిన్పై యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని, వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు. డాన్బాస్ ప్రాంతంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించామన్నారు. కానీ పశ్చిమ దేశాలు క్రూరపద్ధతిలో వ్యవహరించిందన్నారు. ఉక్రెయిన్ పౌరులతో రష్యా యుద్ధం చేయడం లేదని, ఉక్రెయిన్ పాలన పైనే తమ యుద్ధమని చెప్పారు. డాన్బాస్లో ఏమి జరుగుతోందనే విషయంపై పూర్తి అవాస్తవాలు, అబద్ధాలు చెబుతూ పశ్చిమదేశాలు తమ ప్రజలను వంచిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్ లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టి, ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో సంఘీభావం ప్రకటించేందుకు జోబైడెన్ అక్కడ పర్యటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను జెలెన్ స్కీని అడిగి తెలుసుకున్నారు. ఏడాదిగా ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు సాగుతోందని, అదో కిరాతకం, అన్యాయమైన యుద్ధమని జోబైడెన్ అభివర్ణించారు. ఇంత సుదీర్ఘమైన యుద్ధం జరుగుతున్నా… ఉక్రెయిన్ తట్టుకొని నిలబడిందని, అమెరికాతో సహా ప్రపంచం అంతా ఉక్రెయిన్ తోనే వుందని జోబైడెన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే… అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్ లో పర్యటించిన తర్వాత పుతిన్ పై వ్యాఖ్యలు చేశారు.