దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్న పొంగులేటి వ్యాఖ్యలకు మంత్రి అజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పువ్వాడ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ద్వారా గెలిచి పొంగులేటికి వంత పాడుతున్న నేతలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఉన్న వారంతా కేసీఆర్కు విధేయులేనని, నా బ్రాండ్, నా గ్రూప్ అంటే కుదరదని తేల్చి చెప్పారు.
పొంగులేటి లాంటి వ్యక్తులను రాష్ట్రంలో ఎంతో మందిని చూశారని, పార్టీ శాసనసభా పక్షాన్ని 2009లో చీల్చే ప్రయత్నం చేసినప్పుడే కేసీఆర్ చలించలేదు అని గుర్తు చేశారు. పార్టీలో వుంటే వుండాలని, లేకపోతే రాజీనామా చేయాలని సూచించారు. వ్యక్తులపై బీఆర్ఎస్ ఎన్నటికీ ఆధారపడి లేదన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులను బట్టి వుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ గాలే వీస్తుందని, జిల్లాలోని పదింటికి పది స్థానాల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బీఫామ్ తీసుకొని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి సవాల్ విసిరారు. తన వర్గానికి చెందిన 20 మంది నేతల నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంపై పొంగులేటి ఫైర్ అయ్యారు. తన అనుచరులను కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. కొంతమంది తనకు పార్టీలో సభ్యత్వం లేదని అంటున్నారని.. మీ కార్యక్రమాలకు పిలిచినప్పుడు సభ్యత్వం గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో రోజుకో కథనం వస్తుంది. ఒకసారి బీజేపీలో చేరుతున్నారని అంటున్నారు. మరోసారి షర్మిల పార్టీ చేరేందుకు ముహుర్తం ఖరారు అయిందని అంటున్నారు. అయితే నా నిర్ణయం మాత్రం నన్ను నమ్ముకున్న ప్రజల అభీష్టం మేరకే ఉంటుందని, వారి ఇష్టం ప్రకారమే పార్టీ మార్పు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.