మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో కన్నుమూశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన కుతూహలమ్మ… చిత్తూరు జడ్పీ చైర్ పర్సన్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ లోనే సేవలందించారు. 2014 లో తెలుగు దేశం పార్టీలో చేరారు. ఓ యేడాది క్రితమే టీడీపికి రాజీనామా చేశారు.
గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 – 85 మధ్య చిత్తూరు జడ్పీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1991 – 93 మధ్యలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కుతూహలమ్మ పనిచేశారు. 1999 – 2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. 2007 – 2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కుతూహలమ్మ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన కుతూహలమ్మ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.