తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద (పేరూరు బండపై) టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం జలాధివాసం నిర్వహించారు.
ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, చతుర్దశ కలశ స్నపనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం శ్రీ వకుళమాత అమ్మవారి విగ్రహానికి జలాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి వేద మంత్రాల మధ్య మంత్రించిన జలంతో విశేషంగా ప్రోక్షణ (జలాధివాసం) చేయడం వలన విగ్రహంలో ఎలాంటి దోషాలు ఉన్నా, తొలగి ప్రతిష్టకు యోగ్యం అవుతుందని అర్చకులు తెలిపారు. తరువాత కుంభారాధన, ఉక్త హోమాలు చేపట్టారు.
అంతకుముందు జూన్ 23వ తేదీన ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను జెఈవో శ్రీ వీరబ్రహ్మం టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమొంటు సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంఎల్ఏ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, డెప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణు బట్టాచార్యులు, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.