ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆ లేఖలో ఆక్షేపించారు. బాధితుల వినతిపై చర్యలు తీసుకోవడం లేదని, పైగా సాక్షులనే బెదిరిస్తున్నారని చంద్రబాబు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు స్థానిక పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.
మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేయకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు 22 న అధికారులను కోరారు. స్థానిక పోలీసులు బాధితుల వినతిపై చర్యలు తీసుకోవడంలేదు. సాక్షులను బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. కీలక సాక్షి సతీశ్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని పోలీసులు వేధించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడులు చేస్తున్నారు.
పోలీసులే తమతో పచ్చిగడ్డి తెచ్చి పూర్ణ ఇంట్లో గంజాయి వుందంటూ అరెస్ట్ చేశారు. పోలీసు చర్యలను నిరసించిన హేమలతపై దారుణంగా వ్యవహరించారు. హేమలతపై జీపు ఎక్కించడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పోలీసు జీపు డ్రైవర్ పై దాడి జరిగిందని ఆయన్నూ ఆస్పత్రిలో చేర్చారు. పూర్ణపై అక్రమ కేసు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. పోలీసులపై నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు వుండాలని చంద్రబాబు తన లేఖలో డీజీపీని కోరారు.