మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకూ విచారించిన వీడియో, ఆడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అయితే… తాము చెప్పింది చెప్పినట్లే సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని కోర్టుకు తెలిపారు. అయితే… విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాలు విన్న న్యాయస్థానం… ఆడియో, వీడియో రికార్డులను సోమవారం తమ ముందు వుంచాలని ఆదేశించింది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్ లో కోరారు. అలాగే తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని కూడా కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పలుమార్లు కోరినా… సీబీఐ పట్టించుకోలేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో శుక్రవారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా వున్న దస్తగిరిని ఇప్పటి వరకూ సీబీఐ అరెస్ట్ చేయలేదని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా వ్యతిరేకించలేదన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా…. కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని, చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ సాగుతోందని, అలాగే తాను చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చేస్తున్నారని పేర్కొన్నారు.