హైదరాబాద్ లోని వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్ కి చేరుకున్నారు. పోలీసు అకాడమీలోనే బస చేశారు. శనివారం ఉదయం జరిగిన పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని, గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని, నూతన టెక్నాలజీతో కూడిన పోలీస్ మేనేజ్ మెంట్ మరింతగా అందుబాటులోకి రానుందని వివరించారు. ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని కానీ ఐపీఎస్లకు 30 నుంచి 35ఏళ్ల పాటు అధికారం ఉంటుందన్నారు. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ బ్యాచ్లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళే ఉన్నారని.. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఎన్ఐఏ ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందని, ఎన్ఐఏ, ఎన్సీబీ లాంటి సంస్థలను విస్తరించడం ద్వారా నేరస్తులను నియంత్రించడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన నేరాలను జాతీయ డేటాబేస్ లో పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా చెప్పారు. 8ఏళ్ల క్రితం దేశం అంతర్గత ఆందోళనలతో అట్టుడుకిందని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని అమిత్ షా అన్నారు. 7 దశాబ్దాలుగా అంతర్గత భద్రత రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, ఈ పరిస్థితుల్లో 36 వేల మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని.. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశామన్నారు. ఈ బ్యాచ్ లో దాదాపు 195 మంది ఐపీఎస్ లు శిక్షణ పొందారు. 105 వారాల పటు సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్ పొందారు. ఇందులో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు కూడా వున్నారు. మరోవైపు 37 మంది మహిళలు వున్నారు.