అవమానాలు జరిగే చోట ఉండాల్సిన అవసరం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను పోటీచేయాలని భావించడం లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకు స్పష్టమైన సాక్ష్యం దొరికిందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న తనపై నిఘా పెట్టారని మండిపడ్డారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి తనతో చెప్పారన్నారు.
ముందు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదన్నారు. సీఎం జగన్పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానన్నారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్పై ఆధారం దొరికిందన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని… అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి మనస్తాపం చెందానని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడితే.. కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు ఐపీఎస్లకు ఇబ్బందికర పరిస్థితి వస్తుందన్నారు.
కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని ప్రకటించారు. ఆ పార్టీ నుంచి పోటీకి తన మనసు ఏమాత్రం అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. తనను వైసీపీ ఏమాత్రం సంజాయిషీ అడగలేదని, అలాగే చర్యలు చేపట్టారని మండిపడ్డారు. తాను ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు గనక బయటపెడితే… ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుందన్నారు.
నిన్న బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారని, పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లొచ్చని బాలినేని చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి మండిపడ్డారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నానని అన్నారు. అన్నా… జగనన్నా…. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా వుంటుందన్నా? అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు. తాను మాత్రమే ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని, పార్టీలో చాలా మంది ఫోన్ ట్యాపింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.